జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నిక సమయంలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నిక సమయంలో ఓట్ల లెక్కింపు అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో ఈవీఎంను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. అయితే తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి శాసనసభ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను సోమవారం ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో వీఆర్కే కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో సిబ్బంది పరుగులు తీశారు. 

ఇక, మరోవైపు ఈవీలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కనిపించకుండా పోయింది. తాళం చెవి దొరకడం లేదని అధికారులు తెలిపారు. తాళం పలగొట్టి స్ట్రాంగ్‌ రూమ్ ఓపెన్ చేస్తామని చెబుతున్నారు. అయితే హైకోర్టు అనుమతితో నిర్ణయం తీసుకోవాలని లక్ష్మణ్ కోరుతున్నారు. దీంతో ఇంకా స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుచుకోలేదు. 

ఇదిలా ఉంటే.. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు సంబంధించి మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామని కలెక్టర్ యాస్మిన్ బాషా చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సాయంత్రం అవుతుందని అన్నారు. బూతుల వారీగా ఓట్ల వివరాలను నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలోపు హైకోర్టు కోరిన సమాచారం అందజేస్తామని చెప్పారు.

ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకల కారణంగా ఫలితాలు తారుమారయ్యాయని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రీకౌంటింగ్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ ఎన్నికల్లో లక్ష్మన్ కుమార్.. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతిలో 441 ఓట్ల తేడాతో ఓడిపోయారు.