తెలంగాణా రాష్ట్రంలో   తొలి సుదీర్ఘ రాజకీయ యాత్ర చేపట్టిన  గుర్తింపు సిపిఎం కార్యదర్శి తమ్మినేనికి దక్కింది. 29 జిల్లాలలో  1500 గ్రామాల్లో 154 రోజులు పాటు ఈ  పాదయాత్ర  4,150 కిమీ   సాగింది.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదలయిన సుదీర్ఘ రాజకీయ యాత్ర ఈ సాయంకాలం ముగుస్తున్నది. తెలంగాణా ఉద్యమకాలంలో యాత్రలకు కొదవ లేదు. ఉద్యమమే ఒక పెద్ద యాత్ర. అయితే, తెలంగాణా వచ్చాక ఏర్పడిన టిఆర్ ఎస్ ప్రభుత్వం సరైన పంథాలో సాగడం లేదని, తెలంగాణా కలలు నెరవేరే దిశలో ముఖ్య మంత్రి కెసిఆర్ పాలన సాగడంలేదని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర వ్యాపిత యాత్రకు పూనుకున్నారు. ఈ ప్రభుత్వం గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ యాత్ర అని చెబుతూ ఈ యాత్రకు ఆయన ‘మహాజన పాదయాత్ర’ అని నామకరణం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2016 అక్టోబరు 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో ప్రారంభమైన మహాజన పాదయాత్ర రాష్ట్రంలోని కార్మికులు, కర్షకులు, స్కీం వర్కర్లు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగ యువకులు, పెన్షనర్లు, ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ఈ వర్గాలతో సభలు సమావేశాలు జరిపారు. ప్రతి పల్లెనూ పలకరించుకుంటూ గద్వాల, సిరిసిల్ల తప్ప 29 జిల్లాల్లో యాత్ర సాగింది. 154 రోజుల పాటు పాదయాత్ర బృందం 1500 గ్రామాల్లో, 4,150 కిలోమీటర్లు పర్యటించింది.

 హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో 'తెలంగాణ రాష్ట్ర సంక్షేమ, సామాజిక, న్యాయ సమర సమ్మేళనం' ముగింపు సభ ఉంటుంది. ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (కింది ఫోటో) ముఖ్య అతిథిగా హాజరవు తున్నారు.

యాత్రలో జనం అందించిన వినతిప్రతాలను,ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలో ఎప్పటికప్పుడు యాత్రాస్థలం నుంచి వీరభద్రం ముఖ్యమంత్రి కి లేఖల ద్వారా నివేదిస్తూ వచ్చారు. 154 రోజుల సుదీర్ఘ యాత్రలో ఈ సమస్యలను పరిష్కరించాలని ముఖ్య మంత్రి కెసిఆర్‌కు తమ్మినేని 140 లేఖలు రాశారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, శ్మశా నాలకు స్థలాల్లేకపోవటం, రేషన్‌ కార్డుల తొలగింపు, ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు, సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలివ్వకపో వటం, ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఇతర భూములకు కూడా పట్టాలివ్వక పోవటం, ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోవటం, వృత్తిదారులకు ప్రోత్సాహం లేకపోవటం సాగు, తాగునీరు, విద్యాలయాలు, వైద్యశాలలు, పారిశుధ్యం, కాలుష్యం, ఉపాధి అవకాశాలు, కనీస వేతనాలు, సామాజిక అణచివేత అంశాలపై ఆయన ఈ లేఖలు రాశారు.