నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపైనే ప్రధానంగా చర్చ!.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్..
తెలంగాణ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్ భేటీ అనంతరం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కూడా జరగనుంది.
తెలంగాణ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్ భేటీ అనంతరం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కూడా జరగనుంది. ఒకే రోజు రెండు కీలక సమావేశాలు జరుగనుండటంతో.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేబినెట్ భేటీ విషయానిక వస్తే.. ఈ ఏడాది సెప్టెంబరు 17తో భారత యూనియన్లో తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) విలీనమై 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో వజ్రోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
అలాగే.. తెలంగాణ విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరించడం ద్వారా గవర్నర్కు విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా అధికారాలను తగ్గించే అంశంపై కూడా కేబినెట్ చర్చించనుంది. ప్రభుత్వానికి తెలియజేయకుండా రాష్ట్రంలో సోదాలు నిర్వహించేందుకు సీబీఐకి ఇచ్చిన ‘‘జనరల్ కన్సెంట్’’ క్లాజును ఉపసంహరించుకుని సీబీఐని తెలంగాణలోకి రానీయకుండా నిర్ణయం తీసుకోవడంపై కేబినెట్ సమావేశంలోలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు విధులు నిర్వర్తిస్తున్నారని, విపక్ష పార్టీల నేతలను వేధిస్తున్నారని.. కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రానికి నిధులు, విద్యుత్ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. జాతీయ రైతు సంఘాల సమావేశ నిర్ణయాలు, తీర్మానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ భవన్లో సాయంత్రం 6 గంటలకు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పార్టీ రాజకీయ వ్యూహాంపై చర్చించే అవకాశం ఉంది. అలాగేమరియు ముందస్తు ఎన్నికలపై చర్చ జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఇక, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల సన్నద్ధం చేసేలా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఎంపీలను హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.