బైరెడ్డి బెదిరిస్తే మేం ఏం చేశామో తెలుసా: కేసీఆర్
ఆర్డీఎస్ కాలువలో నీళ్లు ఎలా పారుతున్నాయో టీఆర్ఎస్ కు ఓట్ల వరద పారాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోరారు.
ఆలంపూర్:ఆర్డీఎస్ కాలువలో నీళ్లు ఎలా పారుతున్నాయో టీఆర్ఎస్ కు ఓట్ల వరద పారాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోరారు. ఆర్డీఎస్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కకుండా సమైక్య పాలకులు చేశారని ఆయన విమర్శించారు. ఈ విషయమై కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎందుకు నోరు మూసుకొన్నారని ఆయన ప్రశ్నించారు.
మంగళవారం నాడు ఆలంపూర్లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగించారు.ఈ ఎన్నికల్లో మంచి చెడు విచక్షణను ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ కోరారు. ప్రజలకు ఏది మేలైన విషయమో ఆలోచించాల్సిందిగా కేసీఆర్ అభ్యర్థించారు.
58 ఏళ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలనకు, టీఆర్ఎస్ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని చూడాలని కేసీఆర్ ప్రజలను కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణలోనే ఉందన్నారు.
జోగులాంబ అమ్మవారి దీవెనతో గద్వాల వరకు తెలంగాణ ఉద్యమం సమయంలో పాదయాత్ర నిర్వహించినట్టు చెప్పారు. ఆర్డీఎస్లో తెలంగాణకు జరిగిన నష్టంపై టీఆర్ఎస్ అధ్వర్యంలో సాగు నీటిపై జరిగిన నష్టంపై పాదయాత్ర నిర్వహించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
ఆర్డీఎస్ తూములు మూసివేస్తే ఆర్డీఎస్ను బాంబులతో పేల్చిస్తామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రకటనకు తాను కౌంటర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బైరెడ్డి ఆర్డీఎస్ను పేల్చివేస్తే తాను సుంకేసుల బ్యారేజీని బాంబులతో పేలుస్తానని ప్రకటించినట్టు చెప్పారు.
తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీమ్ కు చంద్రబాబునాయుడు అడ్డు పడుతున్నాడని కేసీఆర్ చెప్పారు. ఆర్డీఎస్లో తెలంగాణ హక్కు కింద ఉన్న నీటిని వాడుకొనే విషయమై టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెరపలేదో చెప్పాలన్నారు.
తెలంగాణ ప్రజల కోసం తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీమ్ను కడుతున్న గులాబీ జెండాను ఓడగొట్టాలని చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆలంపూర్ బిడ్డల పౌరుషాన్ని ఓట్ల రూపంలో చూపాలని కేసీఆర్ కోరారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీళ్లు వాడుకొనే హక్కుందన్నారు. ఆర్డీఎస్ లో తెలంగాణ వాటా ప్రకారంగా వాడుకొంటామన్నారు. మిగులు జలాలపై హక్కుందన్నారు.
ఆర్డీఎస్ విషయమై ఎందుకు మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆర్డీఎస్ కాలువలో నీళ్లు ఎలా పారుతున్నాయో టీఆర్ఎస్ కు ఓట్ల వరద పారాలని కేసీఆర్ కోరారు.