సభలో కెసిఆర్ భీష్మ ప్రతిజ్ఞ (వీడియో)
ఈ ఏడాది చివరి కల్లా 2 లక్షల డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి, లేకుంటే ఓట్లే అడగం
ఈ రోజు కెసిఆర్ తెలంగాణా అసెంబ్లీలో భీకరమయిన ప్రతిజ్ఞ చేశారు.
ఆయన గతంలో చాలా ప్రతిజ్ఞలు చేసి ఉండవచ్చు. అయితే, ఈ సారి చేసింది మాత్రం అన్నింటి కంటే విశేషమయింది.
2019 సమీపిస్తున్న సమయంలో ఇలాంటి ప్రతిజ్ఞ చేయడమంటే, ప్రతిపక్షానికి సవాలే.
ఈ ఏడాది చివరి కల్లా తెలంగాణాలో రెండు లక్షల డబల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వకపోతే,2019 ఎన్నికల్లో ఓట్లే అడిగేది లేదని అన్నారు.
2బిహెచ్ కె ప్రోగ్రాం ఎందుకు జాప్యం అవుతూ ఉందో ఆయన ఈ రోజు అసెంబ్లీ వివరణ ఇచ్చి , ఈ ప్రతిజ్ఞ చేసి ప్రతిపక్షాల నోరు మూయించే ప్రయత్నం చేశారు.
‘కాంట్రాక్టర్లు లేకపోవడం వల్లే డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జాప్యం అవుతూ ఉంది,’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అయినా సరే, ‘ఈ ఏడాది చివరికల్లా జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మించి తీరతాం. మిగతా గ్రామీణ ప్రాంతాలలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తాం. 2 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా జరగక పోతే ప్రజలను ఓట్లు అడగం,‘ అని శపధం చేశారు.
‘మేం అడుగున్న రెండు లక్షల ఇళ్లు పద్నాలుగు లక్షల ఇళ్లతో సమానం. అంటే,ఒక్కొక్క ఇల్లు ఏడుఇళ్లతో సమానం. ఖర్చు ఇంటికి ఏడులక్షలు. ఇది పేదల ఆత్మగౌరవానికి సంబంధించింది. విజయవంతంగా పూర్తి చేస్తాం,’ అని ఆయన చెప్పారు.