గత ఏడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను  కేసీఆర్  పార్టీ నేతలకు వివరించారు.

హైదరాబాద్: ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఓటమి పాలైందని కేసీఆర్ చెప్పారు. ఆదివారంనాడు కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:లోక్‌సభ ఎన్నికలు 2024: నేడు తొలి జాబితా విడుదల చేయనున్న బీఆర్ఎస్

గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అయితే అభ్యర్థులను మార్చడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై సానుకూలత ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే కొంపముంచిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ తాను తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో టీడీపీ ఎలా ఓడిపోనుందో తాను ఎన్టీఆర్‌కు వివరించిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారని సమాచారం. 

also read:పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలు, తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన పథకాలను ప్రజలు పోల్చుతున్నారని పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ చెప్పారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయని విషయమై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ సర్కార్ అవలంభిస్తున్న విధానాలతో ప్రజలు తిరిగి తమ పార్టీ వైపునకు వస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం నేతలంతా కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.

also read:వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

పార్టీ కార్యక్రమాలపై కేసీఆర్ గత మాసం నుండే సమీక్షలు ప్రారంభించారు. కాంగ్రెస్ సర్కార్ విధానాలపై బీఆర్ఎస్ విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. ఎన్నికల హామీల అమలు విషయంలో రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తుంది.

పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ ఎంపీ సీట్లను దక్కించుకోవడం ద్వారా ఇతర పార్టీలకు చెక్ పెట్టాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు.