వాసాలమర్రి గ్రామస్తులతో కేసీఆర్ భోజనం: గ్రామాభివృద్దిపై చర్చ
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామస్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు సహపంక్తి భోజనం చేశారు.
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామస్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు సహపంక్తి భోజనం చేశారు.ఇవాళ ఉదయం హైద్రాబాద్ నుండి సీఎం కేసీఆర్ వాసాలమర్రికి చేరుకొన్నారు. వాసాలమర్రికి చేరుకొన్న సీఎం కేసీఆర్ కు మహిళలు మంగళహరతులతో స్వాగతం చెప్పారు. ఆలయంలోని కోదండరామాలయంలో సీఎం కేసీఆర్ పూజలు చేశారు.
గ్రామస్తులతో సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేయడం కోసం ప్రత్యేకంగా వంటకాలను సిద్దం చేశారు. మటన్, చికెన్, బోటీ, తలకాయకూర, చేపలు, చల్లచారు, కోడిగుడ్లు, వంకాయ, ఆలుగడ్డ, మసాల పాపడ, పచ్చిపులుసు, పులిహోర, రెండు రకాల స్వీట్లు, బిర్యానీ రైస్ వంటి వంటకాలను సిద్దం చేశారు.
వాసాలమర్రి అభివృద్ది కోసం గ్రామస్థులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. భువనగిరి-గజ్వేల్ రహదారిపై ఈ గ్రామం ఉంది. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించి తిరిగి వెళ్తున్ సమయంలో ఈ గ్రామంలో కొద్దిసేపు సీఎం కేసీఆర్ ఆగారు. ఊరి సమస్యలపై సీఎం స్థానికులతో చర్చించారు.
గ్రామస్థులను తన ఫాంహౌజ్ కు పిలిపించుకొని చర్చించారు. గ్రామంలో 494 గృహలున్నాయి. మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ వాసాలమర్రి సర్పంచ్ కు ఫోన్ చేశారు. గ్రామానికి తాను వస్తున్నట్టుగా చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి తరహలోనే వాసాలమర్రిని అభివృద్ది చేస్తానని కేసీఆర్ గ్రామస్తులకు గతంలో హామీ ఇచ్చారు. ఈ విషయమై ఆయన చర్చించనున్నారు.