ముందస్తు సంకేతాలు: హుస్నాబాద్ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారం
తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 7వ తేదీ నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోన్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 7వ తేదీ నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోన్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సభకు ముందే కేబినెట్ సమావేశం నుండి ముందస్తు ఎన్నికలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదని ప్రచారం సాగుతోంది.
ముందస్తు ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం తీసుకొనే అధికారాన్ని కేబినెట్ తనకు అప్పగించిన విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభలో ప్రకటించారు. రాష్ట్రానికి, టీఆర్ఎస్ కు ఏది ప్రయోజనమో.. ఆ నిర్ణయాన్ని తీసుకొంటామని కేసీఆర్ ప్రకటించారు.
ముందస్తు ఎన్నికల దిశగానే టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. అయితే సెప్టెంబర్ 7వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని సుమారు 100 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. సుమారు 50 రోజుల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాల్లో రెండు సభల్లో పాల్గొంటారు.
కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమం నుండి టీఆర్ఎస్ కు వెన్నంటి నిలిచింది. అయితే వచ్చే ఎన్నికల ప్రచారాన్ని కూడ ఈ జిల్లా నుండి ప్రచారం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఇందులో భాగంగాగానే కేసీఆర్ హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు సమాచారం. అయితే ఈ నెల 5 లేదా 6 వ తేదీన మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం వరకు ఇవ్వాలని సీఎస్ నుండి అన్ని శాఖలకు సమాచారం వెళ్లింది.
ఈ నెల రెండో తేదీన కేబినెట్ ముగిసిన సమావేశం ముగిసిన వెంటనే ఈ సర్క్యులర్ ఆయా శాఖలకు వెళ్లింది. దీంతో రెండో కేబినెట్ సమావేశం ఉంటుందని కూడ డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి ప్రకటించారు.
దీంతో ఈ కేబినెట్ సమావేశం కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. ఈ సమావేశంలో కీలకమైన అసెంబ్లీ రద్దు లాంటి విషయమై చర్చించే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఇదే సమయంలో హుస్నాబాద్ లో సెప్టెంబర్ 7వ తేదీన జరిగే సభకు ప్రాధాన్యత ఏర్పడింది.