మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు: కేసీఆర్
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు
హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని, ఖర్చుకు వెనుకాడవద్దని సిఎం స్పష్టం చేశారు.
ప్రగతి భవన్ లో సోమవారం మిషన్ భగీరథపై సిఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, మిషన్ భగీరథ ఇ.ఎన్.సి. కృపాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, గొంగిడి సునిత, రాజేందర్ రెడ్డి, కె.విద్యాసాగర్ రావు, భాస్కర్ రావు, వివిధ జిల్లాల నుంచి సిఇలు, ఎస్ఇలు, ఇఇలు హాజరయ్యారు.
సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అధికారులు పురోగతిని వివరించారు. 23,968 ఆవాస ప్రాంతాలకు గాను, 23, 947 ఆవాస ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతున్నదని చెప్పారు. మరో 21 గ్రామాలకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. ఆ గ్రామాలు కూడా కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇండ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు నివేదించారు.
ఓహెచ్ఎస్ఆర్ ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుందన్నారు.
దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ చెప్పారు.
జిల్లాలోని అచ్చంపేట, సిర్పూరు నియోజకవర్గాలు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం లాంటి జిల్లాల్లోని మారుమూలలో ఉన్న చిన్న పల్లెలకు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఆవాస ప్రాంతాలకు కూడా కష్టమైనా సరే, ఆర్థికంగా భారమైనా సరే మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు.
జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని గడువు విధించారు. మార్చి 31లోగా అన్ని ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరా కాని ఇల్లు ఒక్కటి కూడా మిగలవద్దని సిఎం నిర్దేశించారు.
ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలి. ఇప్పటి వరకు జనం ఎక్కడికక్కడున్న వనరులతో అవసరాలు వెళ్ల దీసుకున్నారని సీఎం గుర్తు చేశారు.