నాలుగేళ్లలో గ్రామాల్లో చేయాల్సిన పనులపై డిస్ట్రిక్ట్ కార్డులు: కేసీఆర్ ఆదేశం
అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ పల్లెలన్నీ కూడ బాగుపడి తీరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
హైదరాబాద్:అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ పల్లెలన్నీ కూడ బాగుపడి తీరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
మంగళవారం నాడు హైద్రాబాద్ ప్రగతి భవన్ లో ఆయన కలెక్టర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విషయాలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులు చేసుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సిఎం చెప్పారు.
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతీ గ్రామం ప్రతీ రోజు శుభ్రం కావాల్సిందేనని, ముఖ్యమంత్రి సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరోటి లేదని ఆయన తేల్చి చెప్పారు.
రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. రాబోయే నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే పనులు చేయాలని, ఈ వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలని సిఎం చెప్పారు.
also read:కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభం:ఎజెండా ఇదీ..
ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కలెక్టర్లు, డిపిఓ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకం చేశారు.