గర్భిణులకు 'కేసీఆర్ పౌష్టికాహార కిట్లు'.. సంక్రాంతిలోపు రైతుల అకౌంట్లలో రైతుబంధు సాయం జమచేస్తాం: హరీష్ రావు
Siddipet: సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో 75 పడకల హంస హోమియో మెడికల్ టీచింగ్ కళాశాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు చర్యలు తీసుకుంటున్నారనీ, బస్తీ, పల్లె దవాఖానలను ప్రారంభించడంతో పేద ప్రజలకు వైద్యసేవలు మరింత మెరుగ్గా అందుతాయన్నారు.
Telangana Health Minister T Harish Rao: తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో పాలిచ్చే తల్లుల కోసం కేసీఆర్ కిట్ల తరహాలో గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను త్వరలో ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో 75 పడకల హంస హోమియో మెడికల్ టీచింగ్ కాలేజీని సోమవారం ప్రారంభించిన వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు, గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంపొందించేందుకు ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఉత్పత్తులను పౌష్టికాహార కిట్లో ఉంచుతామన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బస్తీ, పల్లె దవాఖానలను ప్రారంభించడంతో పేద ప్రజలకు వైద్యసేవలు మరింత మెరుగ్గా అందుతున్నాయన్నారు. సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని హరీశ్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేటలో రూ.6 కోట్లతో నేచర్ క్యూర్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తోందని తెలిపారు. అలాగే వికారాబాద్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు త్వరలో ఆయుష్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
గజ్వేల్లో 4 వేల మంది పేదలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన హరీశ్ రావు..
రాష్ట్ర ప్రభుత్వం దసరా, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలు రాజకీయాలకు అతీతంగా పండుగలు జరుపుకునేందుకు కొత్త బట్టలు పంపిణీ చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి క్రైస్తవులకు పంచిపెట్టారు. సోమవారం గజ్వేల్లో నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు నూతన వస్త్రాలను అందించిన అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రంజాన్, దసరా సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేసిందన్నారు. ఈ సందర్భంగా 4 వేల మందికి పైగా కొత్త బట్టలతో కూడిన గిఫ్ట్ ప్యాక్లను అందజేశారు. వారితో కలిసి భోజనం చేసిన హరీశ్ రావు 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
గత ప్రభుత్వాలు ఇక్కడ క్రైస్తవులకు ఎలాంటి ఆసరా ఇవ్వలేదని పేర్కొన్న మంత్రి హరీశ్ రావు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గజ్వేల్ ప్రజల కోసం ఉత్తమ క్రైస్తవ భవన్ను నిర్మించారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పండుగను ముఖ్యమంత్రి ఘనంగా జరుపుకుంటున్నారనీ, రెండో రోజు పాఠశాలలకు ఐచ్ఛిక సెలవుగా ప్రకటించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. సమ్మక్క-సారక్క జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరుపుతోందనీ, ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం జాతీయ పండుగగా గుర్తించడానికి నిరాకరించిందని మంత్రి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ వీ యాదవరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వీ రోజా శర్మ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవనేదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి లోపు ప్రతి రైతు అకౌంట్ లో రైతుబంధు జమ..
రైతుబంధు పథకంలో భాగంగా డిసెంబర్ 28 నుంచి వచ్చే సంక్రాంతి పండుగలోపు ప్రతి రైతు ఖాతాలో ఆర్థిక సాయం జమ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం మార్కెట్యార్డు గజ్వేల్లో జరిగిన ఆత్మకమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న అనంతరం రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా రైతులు యాసంగిలో ఏనాడూ వరి, ఇతర నీటిపంటలు పండించలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో యాసంగి సీజన్లో కూడా వరి సాగు చేయగలుగుతున్నారని తెలిపారు. కెఎల్ఐఎస్ నీటిని వాగులోకి వదులుతున్నందున వేసవిలో కూడా కుడవెల్లి వాగు నిండుకుండలా ఉందన్నారు. గోదావరి నీటితో కళకళలాడుతున్నందున జిల్లాలో ఇప్పుడు ఒక్క ఎకరం భూమిలో కూడా పంటలు ఎండిపోయిన సందర్భాలు లేవని అన్నారు.