మోడీతో 45 నిమిషాలు కేసీఆర్ భేటీ: కొత్త జోనల్ వ్యవస్థపై...
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు 45 నిమిషాల పాటు శనివారం సమావేశమయ్యారు. పది అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయన ప్రధాని అందించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు 45 నిమిషాల పాటు శనివారం సమావేశమయ్యారు. పది అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయన ప్రధాని అందించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని ఆయన ప్రధానిని కోరారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ కు ఆటంకంగా ఉండడంతో కొత్త జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదం తెలియజేయాలని ఆయన ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. జోనల్ వ్యవస్థకు ఆమోదం లభిస్తే టిఎస్ పిఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని యువత పెద్ద యెత్తున దీనిపై ఆశలు పెట్టుకుంది.
హైకోర్టు విభజనకు చొరవ చూపాలని, ఆంధ్రప్రదేశ్ తన హైకోర్టును విడిగా ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే రూ.450 కోట్ల నిధులు ఇంకా పెండింగులో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ వాటిని వెంటనే విడుదల చేయాలని విజ్ఢప్తి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కూడా ఆయన కోరారు. రాష్ట్రంలో కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటుకు సహకరించాలని కోరారు రాష్ట్రానికి చెందిన రైల్వే ప్రాజెక్టులు, లైన్లు త్వరగా పూర్తయ్యే విధంగా రైల్వే శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు. రైతుబంధు పథకం గురించి కూడా ఆయన ప్రధానికి వివరించారు.