టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ భేటీ: కీలకాంశాలపై చర్చ
టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పక్షంతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఆదివారం నాడు భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు వచ్చే నెలలో నిర్వహించే తెలంగాణ విజయ గర్జన సభపై కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.
హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పక్షంతో ఆ పార్టీ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు.Trs రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు.
టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల నిర్వహణతో పాటు, పార్టీ ప్లీనరీ భవిష్యత్తులో నిర్వహించాల్సిన అంశాలపై పార్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వార్డు, గ్రామ, మండల కమిటీ అధ్యక్షుల ఎన్నిక పూర్తైంది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం ఇవాళే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
also read:టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఈ నెల 25న ఎన్నిక
ఈ నెల 25న పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. అదే రోజున పార్టీ ప్లీనరీని నిర్వహిస్తారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తైంది. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ కాలంలో ప్రజల సంక్షేమం కోసం తీసుకొన్న కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించాలని ఆ పార్టీ భావిస్తోంది.
వచ్చే నెల 15న తెలంగాణ విజయ గర్జన పేరుతో వరంగల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ విషయాలపై సీఎం Kcr పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్ధేశం చేయనున్నారు.ఈ నెలాఖరులో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారానికి తెరపడే ముందుగా కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే ఎన్నికల సభలో పాల్గొనే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే అంశంపై కూడ గులాబీ బాస్ కేంద్రీకరించనున్నారు. 2023 లో ఎన్నికలు జరగనున్నాయి,. ఈ ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులు తమకు సవాల్ విసరడానికి కూడ అందనంత దూరంలో పార్టీ బలంగా ఉండాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు కట్టబెట్టారు. మరో వైపు పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటేడ్ పదవులు ఇవ్వనున్నారు.