కేసిఆర్ వ్యూహకర్త కూడా ప్రశాంత్ కిశోరే: స్టాలిన్ కు కూడా..
తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై ఒక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో తనకు తిరుగులేదని కేసీఆర్ భావిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అంత సజావుగా లేదని అనుకుంటున్నారు. దాదాపు 39 మంది ఎమ్మెల్యేలపై స్థానికంగా అసంతృప్తి పేరుకుపోయి ఉందని కేసిఆర్ చేయించిన సర్వేలోనే తేలినట్లు చెబుతున్నారు.
ఈ స్థితిలో ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా నియమించుకునేందుకు ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అది కొలిక్కి రావడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు.
అదే విధంగా డిఎంకె అధినేత స్టాలిన్ కూడా ప్రశాంత్ కిశోర్ ను తన వ్యూహకర్తగా నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా త్వరలో స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి కోసం పనిచేసే ఆలోచన కూడా ప్రశాంత్ కిశోర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.