ఎన్టీఆర్ను ఓడించిన చరిత్ర పాలమూరుది: కేసీఆర్
గట్టు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన
గద్వాల: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
గట్టు ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు. గట్టు ఎత్తిపోతల పథకానికి నల్ల సోమనాద్రి పేరు పెడుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.వచ్చే విద్యా సంవత్సరానికి 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
గద్వాల బస్టాండ్ అభివృద్ధి కోసం తన నిధుల నుండి రూ.2 కోట్లను మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ జన్మలో కరెంట్ పోకుండా చూసుకొంటానని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ అంధకారంలో మునిగిపోతోందని మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అంధకారంలో లేకుండా పోయిందన్నారు. తెలంగాణ అంధకారంలో మునిగిపోతోందని చెప్పిన వాళ్లే అంధకారంలో మునిగిపోయారని చెప్పారు.
తెలంగాణలో భూస్వాములు లేరని చెప్పారు. 54 ఎకరాల కంటే ఎక్కువ భూమికి ఎవరికీ లేదని చెప్పారుపాలమూరు జిల్లా సస్యశ్యామలం కావాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు జిల్లాలో సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించనున్నట్టు చెప్పారు.
ఏ రైతు కూడ అప్పుల్లో కూరుకుపోకుండా ఉండాలని తాను కోరుకొంటున్నట్టు కేసీఆర్ చెప్పారు. రైతుల అప్పులు తీరి జేబుల్లో డబ్బులు ఉండాలన్నారు. దీని కోసం తాను నిరంతరం పనిచేస్తున్నట్టు చెప్పారు.ఎరువులు, విత్తనాల బాధలు లేకుండా రైతులు సకాలంలో వ్యవసాయం చేసుకొంటున్నారని కేసీఆర్ చెప్పారు.
ప్రతి పెద్ద గ్రామానికి విలేజ్ గోడౌన్ పేరుతో గోడౌన్ నిర్మించనున్నట్టు చెప్పారు.రాష్ట్రంలోని జిల్లాలోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులకు సూచనలు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి ఏ మేరకు కూరగాయాలు, పంటలు అవసరమనే విషయమై సమాచారాన్ని సేకరించినట్టు ఆయన చెప్పారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు కూడ తెలంగాణకు వచ్చి వ్యవసాయం నేర్చుకొనే పరిస్థితి తెచ్చేలా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
కొందరు సన్నాసుల కారణంగానే పాలమూరుకు ఈ దుస్థితి వచ్చిందని ఆయన గత పాలకులపై విమర్శలు గుప్పించారు.పాలమూరు నుండి వలసలను నివారించనున్నట్టు కేసీఆర్ చెప్పారు..టీఆర్ఎస్ ను గెలిపించండి , అభివృద్ది చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు మరింత సేవలను అందిస్తామని కేసీఆర్ ప్రజలను కోరారు.
దసరా నాటికి తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావును కోరారు.నాలుగైదు ఏళ్లలో గుర్రంగడ్డ బ్రిడ్జిని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
పాలమూరు జిల్లా ప్రజలు చైతన్యవంతులు. పాలమూరు ప్రజలు ఎన్టీఆర్ లాంటి నాయకుడిని ఓడించారు. ఆ తర్వాత మరో పార్టీని జిల్లాలోని అన్ని సీట్లు గెలిపించారని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో పాలమూరు జిల్లా ప్రజలు టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు.