దేశానికే ట్రెండ్ సెట్టర్: ధరణి పోర్టల్ ప్రారంభించిన కేసీఆర్
ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్ గా మారనుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
మేడ్చల్:ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్ గా మారనుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రారంభించారు.
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లన్నీ కూడ ఈ పోర్టల్ ద్వారానే ఇక నుండి జరగనున్నాయి. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లను నవంబర్ 2వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.రిజిస్ట్రేషన్లతో పాటు మ్యూటేషన్లను కూడ వెంటనే పూర్తి చేయనున్నారు.తెలంగాణ పోరాట యోధుడు వీరారెడ్డి గ్రామమైనందున మూడు చింతలపల్లిని ధరణిపోర్టల్ ను ప్రారంభించినట్టుగా ఆయన చెప్పారు.
ఆధార్ నెంబర్ తో అన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. ఈ పోర్టల్ ద్వారా ఒకరి భూమి మరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుండదన్నారు. ఈ పోర్టల్ తో రైతుల భూములకు సంపూర్ణ రక్షణ లభిస్తోందన్నారు. కరోనా వైరస్ లేకపోతే ఈ పోర్టల్ ఆరు మాసాల క్రితమే వచ్చేదని ఆయన చెప్పారు.
ధరణి పోర్టల్ ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగవని చెప్పారు. ఈ పోర్టల్ లో 1,45,58,000 ఎకరాల భూముల వివరాలను పొందుపర్చినట్టుగా ఆయన తెలిపారు. 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ పూర్తి కానుందన్నారు. ధరణి సైట్ లో అప్ డేట్ అవుతోందన్నారు.
ఒక్క రూపాయి అవినీతి లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని సీఎం చెప్పారు. గతంలో సబ్ రిజిస్ట్రార్లకు ఉన్న అధికారాలను తొలగించామన్నారు. 570 తహసీల్దార్ ఆఫీసులను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా మార్చామన్నారు. కొత్త పని ప్రారంభించినప్పుడు సమస్యలు తలెత్తనున్నాయన్నారు.
రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని సర్వే చేస్తామని కేసీఆర్ చెప్పారు.భూగోళంపై ఉన్న అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూములను సర్వే నిర్వహిస్తామన్నారు. ఈ సర్వే రికార్డులను ఎవరూ కూడ ట్యాంపర్ చేయబోరని చెప్పారు. ప్రతి భూమికి అక్షాంశాలు, రేఖాంఖాలు నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.