ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్ పొగడ్తలు కురిపించారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పొగిడారు.


హైదరాబాద్: ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్ పొగడ్తలు కురిపించారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పొగిడారు.

ఆదివారం నాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పే సమయంలో వైఎస్ఆర్‌ ను గురించి కేసీఆర్ అభినందనలు కురిపించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌భవ స్కీమ్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేరలేదని కేసీఆర్ గుర్తు చేశారు.ఈ విషయాన్ని మోడీ పదే పదే తనకు గుర్తు చేశారని ఆయన చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ కంటే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ బ్రహ్మండంగా ఉందన్నారు.

ఈ స్కీమ్‌ను ఆ పార్టీ నాయకులు చెబితే అమలు చేశారో...లేదా అధికారులు చెప్పారో కానీ ఈ స్కీమ్ బ్రహ్మండంగా ఉందని కేసీఆర్ చెప్పారు. ఇదే పథకానికి ఇంకా కొన్ని జత చేస్తూ అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. అమ్మఒడి లాంటి స్కీమ్‌లను దీనికి జత చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం కంటే ఆరోగ్య శ్రీ మెరుగ్గా ఉందని కేసీఆర్ చెప్పారు మంచి ఎవరు చేసినా కూడ ఆ మంచిని గుర్తించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా వైసీపీతో ఇటీవలనే టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఇటీవలనే కేటీఆర్ వైఎస్ జగన్ తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగానే కేసీఆర్ వైఎస్ఆర్ స్కీమ్ ను అసెంబ్లీ వేదికగా ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

వైఎస్ఆర్ సీఎంగా ఉన్న కాలంలో టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఉన్న ఈటల రాజేందర్‌ను, టీఆర్ఎస్‌ను ఉద్దేశించి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

మేనిఫెస్టో వంద శాతం అమలు: కేసీఆర్