సీఎం కేసీఆర్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి గెలవాలని చూస్తున్నారు.. : ఈటల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి మళ్లీ సీఎం అవుతాననే ధీమాలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు.
![KCR distributes liquor for victory says Etela Rajender ksm KCR distributes liquor for victory says Etela Rajender ksm](https://static-ai.asianetnews.com/images/01h1r148nkhhg11nvse5b2tm1z/frpcjk-amaagpp7-jpg_363x203xt.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి మళ్లీ సీఎం అవుతాననే ధీమాలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. అయితే తెలంగాణ ప్రజలు ఆకలితో చనిపోవడానికైనా సిద్దంగా ఉంటారని.. కానీ వారు ఆత్మ గౌరవం మాత్రం కోల్పోరనే విషయం కేసీఆర్ తెలియదని అన్నారు. జనగాం జిల్లాలోనిస్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తల పోలింగ్ బూత్ మేళాలో రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పంపిణీ చేయదలిచిన డబ్బు వాస్తవానికి తెలంగాణ ప్రజలకు చెందినదేనని.. ఓటర్లు డబ్బులు తీసుకోవచ్చని, అయితే తెలివిగా ఆలోచించి న్యాయం కోసం ఓటు వేయాలని ఈటల రాజేందర్ కోరారు. కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు.. వంటి పథకాలను అమలు చేస్తూ బీఆర్ఎస్ సర్కార్ వెచ్చిస్తున్న సొమ్ము కేవలం 25 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. కానీ కేసీఆర్ ప్రతి వీధి, గ్రామంలో బెల్టుషాపులు తెరిచి సంపాదిస్తున్న సొమ్ము 45 వేల కోట్లకు పైగానే ఉందని ఆరోపించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు మాత్రలు దొరకడం లేదని.. కానీ ఏ సమయంలోనైనా మద్యం బాటిల్ను పొందడం సులభం అని ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వృద్ధులందరికీ పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబాలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేస్తామని అన్నారు.