తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు.  రెండు, మూడు రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే బస చేయనున్నట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట.. ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి సోమేష్ కుమార్, టీఆర్‌ఎస్‌ ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, గడ్డం రంజిత్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ రావులు ఉన్నారు. అయితే రెండు, మూడు రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఎవరెవరిని కలవనున్నారనేపై అధికారికంగా ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు. 

అయితే  కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన దాదాపు 10 రోజుల తర్వాత కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం జరిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానందున.. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఆమెను కలవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ద్రౌపది ముర్మును కలిసి ఆమె శుభాకాంక్షలు తెలపాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించినపెండింగ్ సమస్యలు, వరద సాయంపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. కేసీఆర్ వెంట ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కూడా ఉండటంతో.. కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అధికారిక కార్యకలాపాలు నిర్వహించవచ్చు. కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ప్రతిపక్ష పార్టీల నేతలతో భేటీ..
పార్లమెంటు వర్షకాల సమావేశాలకు ఒకరోజు ముందు జూలై 16న ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. అవసరమైతే తాను ఢిల్లీకి వచ్చి బీజేపీపై పోరులో ప్రతిపక్షాలు, ఎంపీలతో సమావేశాలు నిర్వహిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై పోరాడాలని పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు, ఎంపీలతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో తమ గళాన్ని బలంగా వినిపించాలని వారిని అభ్యర్థించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ వ్యతిరేకంగా పోరాటంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.