మరో యాగానికి కేసీఆర్ సిద్దం:యాదాద్రిలో మహా సుదర్శన యాగం
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో మహాయాగానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే రెండు దఫాలు కేసీఆర్ యాగాలు నిర్వహించారు. ఇప్పుడు మరో యాగాన్ని నిర్వహించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మరో యాగానికి శ్రీకారం చుట్టనున్నారు. త్వరలో యాదాద్రి పుణ్యక్షేత్రంలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయమై చినజీయర్ స్వామితో కేసీఆర్ చర్చించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలోనే రెండు దఫాలు యాగాలు నిర్వహించారు.సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తర్వాత 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ తన ఫామ్ హౌజ్ లో చంఢీయాగం నిర్వహించారు.
ఆ యాగాల తర్వాత మరోసారి కేసీఆర్ యాగం నిర్వహించేందుకు సిద్దమయ్యారు.యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి పుణ్యక్షేత్రంలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టారు.ఈ విషయమై చినజీయర్ స్వామితో కేసీఆర్ మంగళవారం నాడు చర్చించారు.
100 ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగం నిర్వహించాలని నిర్ణయించారు.3000 మంది రుత్విక్కులు, మరో 3000 మంది సహాయకులతో మహాయాగాన్ని గొప్పగా చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.
దేశంతో సాటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలను, భద్రినాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి లాంటి మహాక్షేత్రాల నుంచి మఠాధిపతులను, కేంద్రప్రభుత్వ పెద్దలను, అన్నరాష్ట్రాల గవర్నర్లను, సీఎంలను, మంత్రులను, వివిధ సంప్రదాయాలకు చెందిన మత గురువులను ఈ యాగానికి ఆహ్వానిస్తారు.
మహా సుదర్శన యాగానికి లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. మహా సుదర్శన యాగం నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ చినజీయర్ స్వామితో చర్చించారు.