Asianet News TeluguAsianet News Telugu

పవర్ పాయింట్ ప్రజంటేషన్: నీటి లభ్యతపై జగన్‌కు వివరించిన కేసీఆర్

గోదావరి, కృష్ణా నదుల్లో ఏ మేరకు నీరుంది.. ఎక్కడెక్కడ  ఎగువ రాష్ట్రాలు బ్యారేజీలు నిర్మించారనే విషయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్  ద్వారా వివరించారు. 

kcr conducts power point presentation at cm's meeting in hyderabad
Author
Hyderabad, First Published Jun 28, 2019, 3:56 PM IST

హైదరాబాద్:  గోదావరి, కృష్ణా నదుల్లో ఏ మేరకు నీరుంది.. ఎక్కడెక్కడ  ఎగువ రాష్ట్రాలు బ్యారేజీలు నిర్మించారనే విషయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్  ద్వారా వివరించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రతి ఎకరానికి సాగు నీరు అందించేందుకు వీలుగా ప్లాన్ చేయాలని ఇద్దరు సీఎం నిర్ణయించారు.

హైద్రాబాద్‌ ప్రగతి భవన్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్  తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో నదుల నీటిని సమర్ధవంతంగా వాడుకొనే విషయమై చర్చించారు. 

గోదావరి, కృష్ణా నదిలో నీటి లభ్యతపై తెలంగాణ సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు గోదావరి, కృష్ణా వాటి ఉపనదులపై లెక్కలేనన్ని బ్యారేజిలు నిర్మించడం వల్ల కిందికి నీటి రాని పరిస్థితిని వివరించారు. ఏ రాష్ట్రం ఏ నదిపై ఎక్కడ అక్రమంగా బ్యారేజీలు నిర్మించిందనే విషయాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా కేసీఆర్  తెలిపారు.

సి.డబ్ల్యు.సి. లెక్కల ప్రకారం ఏ పాయింట్ వద్ద ఎంత నీటి లభ్యత ఉందో  చూపారు.. గూగుల్ మ్యాపుల సహకారంతో గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సమర్థ వంతంగా వినియోగించుకోవడానికున్న మార్గాలను ప్రతిపాదించారు. 

 కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలి. దీనివల్ల సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న రాయలసీమ, పాలమూరు, నల్గొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు , తాగు నీటి సమస్య తీరే అవకాశం ఉందని  కేసీఆర్  చెప్పారు. 

పోలవరం నుంచి వేలేరు ద్వారా విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకుపోవాలి. వంశధార, నాగావళి నదుల నీళ్లను కూడా సముద్రం పాలు కాకుండా సమర్థంగా వినియోగిస్తే తమకు నీళ్లు రావడం లేదని, తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఉత్తరాంధ్ర వాసుల బాధ కూడా తీరుతందని కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

ఇటీవల జరిగిన  ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని కేసీఆర్ చెప్పారు.  బేషజాలు లేవు.. బేసిన్ల గొడవలు, అపోహాలు లేవన్నారు. వివాదాలు కావాలనుకొంటే  మరో తరానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

కేసీఆర్, జగన్ లు వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజలకోణం నుంచే ఆలోచిస్తరు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలు చేయడమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో, పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నట్టు కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రజలకు ఎంత వీలయితే అంత మేలు చేయడమే మా లక్ష్యం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

పవర్ పాయింట్ ప్రజంటేషన్: నీటి లభ్యతపై జగన్‌కు వివరించిన కేసీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios