కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ప్రధాని మోదీ దురహంకారం, నియంతృత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు అని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘‘భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్ర మోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. 

Also Read: రాహుల్‌పై అనర్హత వేటు: ఈరోజు రాజ్యాంగ ప్రజాస్వామ్యం కొత్త పతానాన్ని చూశాం.. బీజేపీపై మమత ఫైర్

Also Read: రాహుల్ గాంధీ ముందున్న దారులేమిటీ? 8 ఏళ్లు ఎన్నికలకు దూరమేనా? కోర్టులో పిటిషన్ వేస్తారా?

నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.