వరదలతో అతలాకుతలమైన కేరళకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాయం ప్రకటించారు. వరదలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. వరదల తాకిడికి 324 మంది మృత్యువాత పడ్డారు. 

హైదరాబాద్: వరదలతో అతలాకుతలమైన కేరళకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాయం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 25 కోట్ల రూపాయల సాయం ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాను ప్రకటించిన నిధులను కేరళ రాష్ట్రానికి అందించాలని కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ది చేసేందుకు రెండున్నర కోట్ల విలువైన ఆర్వో మిషిన్లను కూడా కేరళకు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

కేరళను ఆదుకోవాల్సిన కర్తవ్యం తోటి రాష్ట్రంగా తెలంగాణకు ఉందని చెప్పారు. తెలంగాణ లోని పారిశ్రామిక వేత్తలు, ఇతర వ్యాపారులు కేరళను ఆదుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందిస్తే వాటిని తక్షణం కేరళ రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

ఇదిలావుంటే, కేరళ వరద బాధితులకు రూ. 10 కోట్ల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో సంభవించిన ప్రకృతివైపరిత్యాల వల్ల ప్రాణ, ఆస్థి నష్టం జరగడం పట్ల సీఎం తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ విపత్తు నుండి కేరళ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.