యూత్ లో నయా ట్రెండ్: రోడ్లపై బర్త్ డే సెలబ్రేషన్స్, కేసులు తప్పవంటూ పోలీసుల వార్నింగ్
బర్త్ డే సెలబ్రేషన్స్ అంటే ఒకప్పుడు ఇంట్లో చేసుకునేవారు. కాస్త ఉన్నవాళ్లైతే రెస్టారెంట్లలో జరుపుకునేవారు. ఇంకా సెలబ్రిటీలు అయితే ఫంక్షన్ హాల్స్ లోనే వేడుకలు జరుపుకుంటారు. ఇవన్నీ సాధారణంగా చూస్తూనే ఉంటున్నాం.
కరీంనగర్: బర్త్ డే సెలబ్రేషన్స్ అంటే ఒకప్పుడు ఇంట్లో చేసుకునేవారు. కాస్త ఉన్నవాళ్లైతే రెస్టారెంట్లలో జరుపుకునేవారు. ఇంకా సెలబ్రిటీలు అయితే ఫంక్షన్ హాల్స్ లోనే వేడుకలు జరుపుకుంటారు. ఇవన్నీ సాధారణంగా చూస్తూనే ఉంటున్నాం.
అయితే కాలంతో పాటు సెలబ్రేషన్స్ తీరుకూడా మారిపోయింది. ఇండ్లలో నలుగురి మధ్యలో జరుపుకున్న సెలబ్రేషన్స్ కాస్త ఇప్పుడు దారితప్పి రోడ్లపైకి వచ్చేశాయి. రోడ్లపై పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమే ఇప్పుడొక ఫ్యాషన్ అయిపోయింది.
ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధుల తనయులు రోడ్లపై జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నానా హంగామా చేస్తున్నారు. ఏపీలో ఒక మంత్రికొడుకు ఆ తర్వాత ఎమ్మెల్యే కుమారుడు రోడ్డుపై బర్త్ డే సెలబ్రేుషన్స్ జరుపుకుని ట్రాఫిక్ నిలిపివేసి రచ్చ రచ్చ చేశారు.
రోడ్లపై పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఒక ట్రెండ్ గా చేసుకున్న యువత ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్న విషయం మరచిపోయి రోడ్లపై ఎంజాయ్ చేస్తూ అమితానందాన్ని పొందుతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఇప్పుడు కరీంనగర్ లో చోటు చేసుకుంది. ఓ యువకుడు తన మిత్రులతో కలిసి రోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. మద్యం సేవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మద్యం సేవిస్తూ రహదారిపై వచ్చి పోయే వారికి, ఆ ప్రాంతంలో నివసించే వారికి అసౌకర్యం కలిగించారు. ఈ ఘటనపై కరీనంగర్ పోలీసులు ఆరా తీశారు. రోడ్లపై పుట్టినరోజులు జరుపుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోడ్లపై పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దాంతోపాటు ఇతరులకు అసౌకర్యం కలుగుతుందన్నారు. పొరపాటున ఏదైనా కేసులో కనుక ఇరుక్కుంటే భవిష్యత్తులో వారికి విద్య ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.
యువత ఇలాంటి పోకడకు పోకుండా చక్కటి వాతావరణంలో ఒక స్థలంలో గాని హోటల్ ఫంక్షన్ హాల్ లాంటి వాటిలో గాని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కరీంనగర్ పోలీసులు హెచ్చరించారు.