తెలంగాణలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదని కేంద్రం తేల్చి చెప్పింది. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పొందే అర్హత లేదని కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. గురువారం లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా జాబితాలో చేర్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి 2016 ఫిబ్రవరి, 2018 డిసెంబర్ నెలలో ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారని, అయితే దానికి పెట్టుబడుల అనుమతి లేని కారణంగా జాతీయ హోదాలో చేర్చడానికి అర్హత లేదని స్పష్టం చేశారు.
ఏ ప్రాజెక్టు నైనా జాతీయ హోదా ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలంటే కేంద్ర జల సంఘానికి నివేదించాలని, తరువాత దానికి అడ్వైజరీ కమిటీ ఆమోదముద్ర ఉండాలని చెప్పుకొచ్చారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం దానికోసం పెట్టుబడుల అనుమతి పొందాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత జాతీయ హోదా ప్రాజెక్టుల కోసం రూపొందించిన నిబంధనల పరిధిలోకి వస్తే దాన్ని హై పవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది అన్నారు. ఈ కమిటీ ఆమోద ముద్ర వేసిన తర్వాత నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చడానికి అనుమతి ఇస్తుందని వివరించారు.
