జోనల్ వ్యవస్థపై కుస్తీ: డీల్లీకి కేసీఆర్, మోడీ వింటారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జోనల్ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసింది.కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జోనల్ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసింది.కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర అవసరాల మేరకు కేసీఆర్ జోనల్ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేశారు. తెలంగాణలోని 90 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో జోనల్ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేశారు. జోనల్ వ్యవస్థలో మార్పులకు ఆమోదముద్ర వేయించుకోవడంతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న పనులకు ఆమోద ముద్ర వేయాలని కేసీఆర్ ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో రెండు మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం లేకపోలేదు.
కొత్త జోనల్ వ్యవస్థకు ఈ ఏడాది మే 27వ తేదీన తెలంగాణ కేబినేట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాలకు గాను 7 జోన్లతో పాటు రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రతి జోన్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేశారు. 5శాతం ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి.
ఒకటోతరగతి నుండి 7వ తరగతి వరకు తెలంగాణలో విద్యాభ్యాసం చేస్తే వారిని స్థానికులుగా గుర్తిస్తారు. అంతేకాదు వరుసగా నాలుగేళ్లపాటు ఒక్క జోన్, జిల్లా పరిధిలో విద్యాభ్యాసం చేస్తే వారిని ఆయా జోన్, జిల్లా పరిధిలో స్థానికులుగా గుర్తిస్తారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో `1975లో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జోన్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. అయితే రాష్ట్రం విడిపోయినందున తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా జోన్ సిస్టమ్ ను కేసీార్ సర్కార్ మార్చింది.
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మార్చిన జోన్ సిస్టమ్ కు సంబంధించి కేంద్రం అనుమతి కోసం తెలంగాణ సీఎం ఈ ఏడాది మే మాసంలో ప్రధానమంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ సమయంలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఆయనకు లభ్యం కాలేదు.
ఈ సమయంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి ఆయన జోనల్ వ్యవస్థకు సంబంధించి అనుమతివ్వాలని కోరారు.కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించిన విషయమై ప్రధానమంత్రిని కలిసి వివరించాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన ఢిల్లీకి వెళ్లారు. "