తెలంగాణలో మరో ప్రముఖ కంపెనీ పెట్టుబడి.. 7 వేల ఉద్యోగాలు వస్తాయన్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. తెలంగాణలోని ఇబ్రహీంపట్నం, ములుగులో గార్మెంట్ తయారీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు జాకీ బ్రాండ్ ఇన్నర్వేర్ తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్తో తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో బుధవారం సమావేశమయ్యారు. ఈ ఫ్యాక్టరీల ఏర్పాటుతో 7,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని, కోటి వస్త్రాలు ఉత్పత్తి అవుతాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
‘‘ప్రసిద్ధ ఇన్నర్వేర్ బ్రాండ్ జాకీ (పేజ్ ఇండస్ట్రీస్) ఇబ్రహీంపట్నం, ములుగులో గార్మెంట్ తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేయనుందని.. రాష్ట్రంలో 7000 ఉద్యోగాలను సృష్టించే 1 కోటి వస్త్రాలను ఉత్పత్తి చేస్తుందని తెలుపడం ఆనందంగా ఉంది’’ అని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణను ఎంపిక చేసుకున్నందుకు ఆ సంస్థకు హృదయపూర్వక స్వాగతం, శుభాకాంక్షలు అని కేటీఆర్ అన్నారు.
ప్రస్తుతం ఉన్న టెక్స్టైల్ అండ్ గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల జాబితాలో జాకీ గార్మెంట్ కొత్తగా చేరనుంది. తెలంగాణ టెక్స్టైల్ అండ్ గార్మెంట్ సెగ్మెంట్లోని పెట్టుబడిదారులలో కిటెక్స్, వెల్స్పన్, గణేషా ఎకోస్పియర్, యంగ్గోన్, గోకల్దాస్ ఇమేజెస్, వైట్గోల్డ్ స్పింటెక్స్, దివ్య టెక్స్టైల్స్తో ఇతరులు ఉన్నారు.