జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీద ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి మరోసారి వాగ్వాదానికి దిగింది. 

జనగామ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి… ఆయన కుమార్తెల మధ్య వివాదం మరోసారి తెర మీదకి వచ్చింది. ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి సోమవారం తండ్రిని బహిరంగంగా నిలదీసింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ‘జనగామకు రాజునని చెప్తుంటావు.. నా సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ ఈ తప్పుడు పనులు ఏంటిది నాన్నా’ అంటూ ఆమె నిలదీసింది. ఈ ఘటన సోమవారం జరిగింది.

సోమవారం జనగామ శివారు వడ్లకొండలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాల్గొన్నారు.. కార్యక్రమం ముగించుకుని ముత్తిరెడ్డి వెళ్ళిపోతుండగా ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి, అల్లుడు అక్కడికి వచ్చారు. తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దగ్గరికి వచ్చిన కూతురు తుల్జా భవాని రెడ్డి.. చేర్యాలలో 1200 గజాల భూమిని తన పేరిట ఎందుకు రిజిస్ట్రేషన్ చేశామంటూ తండ్రిని నిలదీసింది. నలుగురు ముందు నిలదీయడంతో తాను చర్యలు ఎలాంటి భూమి కొనలేదని ఎమ్మెల్యే తెలిపారు. 

కూతురు ఆరోపణలు.. కన్నీటిపర్యంతమైన ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే...

రిజిస్ట్రేషన్ రోజు ఒక్కపేపర్ మీదనే సంతకం చేశానన్నారామె. అది కూడా కార్యాలయం దగ్గర తనను బెదిరించి పెట్టించారని ఆరోపించారు. తన సంతకం ఫోర్జరీ చేసినందుకు తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీద చేర్యాల పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని తెలిపారు. ముత్తిరెడ్డి చేస్తున్న తప్పులకు కూతురిగా తాను కోర్టుల చుట్టు తిరగాల్సి ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తపరిచారు. దీనికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. ఫోర్జరీ సంతకం అంటున్నావ్ కదా అమ్మ.. అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది.. ఇప్పటికే నా మీద ఓ కేసు పెట్టావు’ అని కూతురుతో అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

 ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ‘నా రాజకీయ ప్రత్యర్థులు నామీద నా కూతురిని ఉసిగొలుపుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామలో గతంలో కలెక్టరే తనమీద ఆరోపణలు చేసినా.. ఎవరూ... ఏమీ.. చేయలేకపోయారని తన మీద ముఖ్యమంత్రి కేసీఆర్కు నమ్మకం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా గత నెల 9వ తేదీన ఎమ్మెల్యే ముద్దిరెడ్డి యాదగిరి రెడ్డి పై ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి.. హైదరాబాదులోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కేసు పెట్టింది.