తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సై అంటున్న జనసేన
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారని పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు స్థానాల్లో పోటీ చేశామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే అంశంపై తెలంగాణలోని జనసేన పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలో పోటీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్ లు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారని పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు స్థానాల్లో పోటీ చేశామని చెప్పుకొచ్చారు.
అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అందుకు భిన్నంగా ఉంటుందని అందుకే అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జనసేన పార్టీకి యువత, మహిళలు బలం అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ ఏడు సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరమని తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనసేన కార్యకర్తలు అభిప్రాయపడినట్లు తెలిపారు.
ఇకపోతే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు కమిషనర్ నాగిరెడ్డి. 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.