హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎదుట ఉద్రికత్తలు చోటుచేసుకున్నాయి. ప్రెస్ క్లబ్‌లో పోసాని మురళీకృష్ణ నిర్వహిస్తున్న సమావేశాన్ని అడ్డుకోవడానికి జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

హైదరాబాద్: సోమాజిగూడ్(Somajiguda) ప్రెస్ క్లబ్‌లో పోసాని(Posani) మురళీ కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌(Pawan kalyan)పై విమర్శలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన(Jansena) కార్యకర్తలు వెంటనే పరుగున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరకు వచ్చారు. పోసాని మురళీ కృష్ణ ప్రెస్ మీట్ అడ్డుకోవడానికి యత్నించారు. పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రెస్ క్లబ్ ఎదుట ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడ మోహరించారు. పలువరు అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ స్టేట్ జనసేన యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ఈ నిరసనకు సారథ్యం వహించిన లక్ష్మణ్‌తోపాటు ఇంకొందరిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రెస్ క్లబ్ బయట గుమిగూడిన జనసేన కార్యకర్తల దగ్గరకూ మీడియా ప్రతినిధులు వెళ్లారు. మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ పోసానిపై విరుచుకుపడ్డారు. పోసాని మురళీ కృష్ణ పేరే మెంటల్ కృష్ణ అని విమర్శించారు. ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సైకో కాదని, పోసానీనే సైకో అని అన్నారు. ఇంతలో పోలీసులు లక్ష్మణ్‌ను పోలీసు వ్యాన్‌లోకి తీసుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు.