మహంకాళమ్మకు ప్రణామాలు... తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్
భక్తి పారవశ్యాన్నే కాకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపచేసే ఒక మహత్తర వేడుక మన బోనాల పండగ అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే ఆషాడ బోనాలు ఉత్సవం వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుక జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు.
''భక్తి పారవశ్యాన్నే కాకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపచేసే ఒక మహత్తర వేడుక మన బోనాల పండగ. ఆషాడ మాసంలో ఆడపడుచు అవతారంలో పుట్టింటికి వచ్చే ఆ పరమేశ్వరిని సంబరంగా పూజించడం సంప్రదాయంగా వస్తోంది. తెలంగాణతో పాటు అనేక ప్రాంతాల్లో భక్తి ప్రపత్తులతో జరుపుకునే మనోభీష్ట వేడుక ఈ బోనాల పండగ. లష్కర్ బోనాలుగా ప్రసిద్ది చెందిన సికింద్రాబాద్ మహంకళి అమ్మవారి బోనాల ఉత్సవం నేడు ప్రారంభమువుతున్న శుభవేళ నా తరపున, జన సైనికుల భక్తిపూర్వక శుభాకాంక్షలు'' అన్నారు.
read more మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని దంపతులు
''తన బిడ్డలు, తన కుటుంబం, తన ప్రాంతం సుభిక్షంగా ఉంండాలని బోనమెత్తే ప్రతీ ఆడపడుచును ఈ పరమేశ్వరి ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. ప్రకృతి విపత్తులు, రోగ బాధలు లేని ఆనందకర జీవితాన్ని ప్రజలందరికీ ప్రసాదించాలని మహంకాళి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను'' అన్నారు పవన్ కల్యాణ్.