పద్మశ్రీ వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలి : పవన్ ఆకాంక్ష
రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు, వృక్ష ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య (vanajeevi ramaiah) ఇటీవల రోడ్డు ప్రమాదానికి (road accident) గురికావడం తెలిసిందే. తీవ్ర గాయాలు కావడంతో ఆయనను ఐసీయూలో వుంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామయ్యకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన (janasena) అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) స్పందించారు.
వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలని అభిలషిస్తున్నట్టు పవన్ కోరుకున్నారు. పచ్చదనం కోసం ఆయన పడే తపన, చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తాయని పవన్ కల్యాణ్ అన్నారు. మరోవైపు.. తాను రోడ్డు ప్రమాదంలో గాయపడడానికి కారకుడైన బైకర్పై వనజీవి రామయ్య పెద్దమనసు చూపారు. అతడిపై పోలీసు కేసు వద్దని, అతనితో 100 మొక్కలు నాటిస్తే చాలని సూచించారు.
Also Read:పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రమాదం:ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
కాగా.. మే 18 ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రామయ్య తన Bike పై వెళ్లాడు. ఈ సమయంలో రోడ్డు దాటుతుండగా మరో బైక్ వచ్చి రామయ్య వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు రామయ్యను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అప్పటికే వనజీవి రామయ్య అనారోగ్యంగా ఉన్నారు. గతంలో ఆయన కాలికి గాయమైంది. కాలికి సర్జరీ చేయాలని కూడా వైద్యులు సూచించారు. ఈ తరుణంలో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రామయ్య తలకు గాయమైంది. 2019 మార్చిలో వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మార్చి 30న తన మనమరాలిని చూసి బైక్ పై వెళ్తున్న రామయ్యను మున్సిపల్ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయనను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందిన తర్వాత రామయ్య కోలుకొన్నారు.