లంచం కేసులో మాదాపూర్ ఎస్ఐ రాజేంద్రకు జైలు శిక్ష.. తీర్పు వెలువరించిన ఏసీబీ కోర్టు
లంచం తీసుకుంటూ దొరికిపోయిన కేసులో మాదాపూర్ ఎస్ఐగా పని చేస్తున్న రాజేంద్రకు ఏసీబీ కోర్టు జైలు శిక్ష విధించింది. రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడిన కేసులతో తాజాగా తీర్పు వెలువడింది.
అవినీతికి పాల్పడుతూ దొరికిపోయిన పోలీసు అధికారికి ఏసీబీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు జరిమానా కట్టాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం మాదాపూర్ ఎస్ఐగా పని చేస్తున్న కే.రాజేంద్ర గతంలో రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఎస్ఐగా పని చేశారు. 2013 సంవత్సరంలో ఎస్ ఐ అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇర్షాద్ ఖురేష్ అనే వ్యక్తికి సంబంధించిన బైక్ ను విడుదల చేసేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు.
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. మరో 1,540 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతడి నుంచి ఫిర్యాదును స్వీకరించారు. ఖురేష్ ఎస్ఐకు లంచం అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనిపై అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. తాజాగా ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు ఐదు వేల రూపాయిల ఫైన్ వేసింది. ఫైన్ కట్టకపోతే మూడు నెలల పాటు శిక్ష పెరుగుతుందని పేర్కొంది.