తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలలో లోపాలేమిటో రాహుల్ గాంధీకి చెబుతానని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికలలో చిన్నిపిల్లల చేష్టల మాదిరిగా రాజకీయం చేస్తే నడవదని చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలలో లోపాలేమిటో రాహుల్ గాంధీకి చెబుతానని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈరోజు ఢిల్లీలో టీ కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా జగ్గారెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి హాజరయ్యే ముందు జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసివస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని చెప్పారు. పీసీసీ వ్యవహారానికి సంబంధించి ఏడాది కాలంగా తాను ఏం మాట్లాడటం లేదని అన్నారు.
ఎన్నికలలో చిన్నపిల్లల చేష్టల మాదిరిగా రాజకీయం చేస్తే నడవదని అన్నారు. అలా వ్యవహరిస్తే మరింత నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కావాల్సి ఉందని అన్నారు. అయితే ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం జరగలేదని తెలిపారు. పార్టీలో పొరపాట్లు, జరగబోయే నష్టం వంటివి రాహుల్ గాంధీకి వివరిస్తానని చెప్పారు. సమయం తీసుకుని రాహుల్ గాంధీకి చెబుతానని.. వారు ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంటుందన్నారు.
అయితే ఎన్నికలకు ఎదుర్కొవడం ఆషామాషీ వ్యవహారం కాదని అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే.. చాలా మంది రాజకీయ జీవితాలు దెబ్బతింటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్లే.. పార్టీ నాయకుల మీద బురద జల్లుతున్నారని విమర్శించారు. శత్రువు కత్తితోని వస్తే ఎదుర్కొవచ్చని.. పక్కకు ఉన్నోడే కత్తి తీసుకొస్తే ఏం చేస్తామని ప్రశ్నించారు.
