నూజివీడు సీడ్స్, బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ దివ్యశ్రీపై ఐటీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో అక్రమంగా రూ.400 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో రూ.90 కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టించినట్లు నిర్ధారించారు.
బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ దివ్యశ్రీపై ఐటీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు జరిపారు. అలాగే హైదరాబాద్ లోని నూజివీడు సీడ్స్ కంపెనీలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దివ్యశ్రీ, నూజివీడు సీడ్స్ కంపెనీ మధ్య జాయింట్ లావాదేవీలు వున్నట్లుగా అధికారులు గుర్తించారు.
దీనిలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలోని ఈ రెండు సంస్థలకు చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 15 రోజుల క్రితం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యకలాపాలను సాగిస్తోంది.
అక్రమంగా రూ.400 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో రూ.90 కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు నిర్ధారించారు. నకిలీ సేల్స్ తో ఈ రెండు కంపెనీలు భారీగా రుణాలు తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈరోజు నిర్వహించిన సోదాల్లో రూ.3.5 కోట్ల నగదు, రూ.18.50 కోట్ల విలువైన బంగారం, వెండిని అధికారులు సీజ్ చేశారు. నకిలీ ఇన్వాయిస్ లతో రూ.28 కోట్ల క్రయ విక్రయాలు నిర్వహించినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు కంపెనీలు కలిసి 3 నగరాల్లో వెంచర్ లు వేసినట్లుగా తేల్చారు.
