కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు.. విచారణకు రావాల్సిందిగా నోటీసులు..
కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు ముగిసిన అనంతరం విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు.

కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు ముగిసిన అనంతరం విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు. వివరాలు.. ఆదాయ పన్ను శాఖ అధికారులు హైదరాబాద్లోని ఎక్సెల్ గ్రూపు కంపెనీలు, కంపెనీల డైరెక్టర్లకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ఎక్సెల్ గ్రూపు కంపెనీల ఆదాయపు పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి భార్య మంజూష ఎక్సెల్ సంస్థలో డైరెక్టర్గా ఉన్నారు. ఈ క్రమంలోనే అనిరుధ్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అయితే తాజాగా సోదాలు ముగించిన అధికారులు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు అందించారు. ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఐటీ ఫార్మట్లో ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అయితే అనిరుధ్ రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీచేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక, ఎక్సెల్ గ్రూపు చెన్నై ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాల సాగిస్తుంది. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఇన్ఫ్రా, ఐటీ, ట్రావెల్, ఇంజనీరింగ్, హెల్త్కేర్, ఫైనాన్స్, ట్రేడింగ్ రంగాలతో పాటు రబ్బర్, ప్లాస్టిక్ తయారీ వ్యాపారంలో పాల్గొంటున్నాయి. హైదరాబాద్లోని గచ్చిబౌలి, మైండ్స్పేస్, బాచుపల్లి, చందానగర్, కోకాపేట్, బాబూఖాన్ లేక్ ఫ్రంట్ విల్లాస్ ప్రాంతాల్లోని ఎక్సెల్ గ్రూపు కార్యాలయాల, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో అనేక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.