పబ్జీ ఆడొద్దన్నందుకు: కిడ్నాప్ డ్రామా, ముంబై-హైదరాబాద్ మధ్య చక్కర్లు
ప్రభుత్వం, మానసిక వైద్యులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా రోజు రోజుకి పబ్జీ భూతానికి బలవుతున్న విద్యార్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో పబ్జీ గేమ్ ముసుగులో ఓ ఇంటర్ విద్యార్ధి కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులను, తల్లిదండ్రులను ఉరుకులు పెట్టించాడు.
ప్రభుత్వం, మానసిక వైద్యులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా రోజు రోజుకి పబ్జీ భూతానికి బలవుతున్న విద్యార్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో పబ్జీ గేమ్ ముసుగులో ఓ ఇంటర్ విద్యార్ధి కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులను, తల్లిదండ్రులను ఉరుకులు పెట్టించాడు.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ పుప్పాలగూడ శ్రీరాంనగర్లో నివాసం ఉండే సమీర్ అర్మన్ నార్సింగిలోని జాహ్నవి జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
సాయంత్రం సమయంలో షేక్పేట్లోని ఆకాశ్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు చేస్తున్నాడు. ఇతని తండ్రి ఆస్ట్రేలియాలో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మేనేజర్గా పనిచేస్తున్నారు.
అయితే సమీర్కు వీడియో గేమ్ల పిచ్చి వుంది. గత కొంతకాలంగా అతను మొబైల్లో పబ్జీ గేమ్ ఆడుతూ చదవును నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీనిని గమనించి ఫోన్ లాక్కొని మందలించింది.
దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సమీర్ శుక్రవారం మణికొండలో ఉంటున్న స్నేహితుడు సిద్ధార్ధ వద్దకు వెళ్లి అటు నుంచి కాలేజీకి వెళతానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.
ఏటీఎం నుంచి నగదు తీసుకుని రాత్రి 9.30 గంటలకు ఇమ్లీబన్ బస్స్టేషన్ నుంచి ముంబై బయలుదేరాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో వాష్రూంకు వెళ్లేందుకు దిగాడు.
అయితే అతను తిరిగి వచ్చేలోపు బస్సు వెళ్లిపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే అక్కడే వున్న తోటి ప్రయాణికుల ఫోన్ తీసుకుని ఉదయం 7 గంటలకు తల్లికి ఫోన్ చేశాడు.
మీ అబ్బాయిని కిడ్నాప్ చేశామని, మూడు లక్షల రూపాయలు పంపాలని డిమాండ్ చేశాడు. అయితే ఆమె ఈ విషయంగా పెద్దగా స్పందించలేదు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ తిరిగి చేరుకుని సాయంత్రం 6 గంటలకు మాచర్లలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆన్లైన్లో బస్సు టికెట్ బుక్ చేసుకున్నాడు.
బుకింగ్ కన్ఫర్మేషన్ మేసేజ్ ఇంట్లో ఉన్న ఫోన్కు రావడంతో తల్లి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాచర్లకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న బస్సులో కూర్చొన్న సమీర్ను రాయదుర్గం పోలీసులు పట్టుకుని తల్లికి అప్పగించారు.