పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) ప్రధాని నరేంద్ర మోడీకి (pm narendra modi) బుధవారం లేఖ రాశారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని, అలాగే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అయితే 5 ఏళ్లు గడిచినా ఆ దిశగా కేంద్రం నిర్దిష్టమైన, నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఏదీ ప్రారంభించబడలేదని అన్నారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా గత ఐదేళ్లలో అన్నిఇన్పుట్ ఖర్చులు రెట్టింపు అయ్యాయని అన్నారు. ఇవి రైతుల ఆదాయాన్నితగ్గించడంతో పాటు ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు.
డీఏపీ (dap) వినియోగాన్ని తగ్గించడానికి రాష్ట్రాలు ప్రచారాన్ని చేపట్టాలని ప్రోత్సహిస్తూనే.. గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి ధరలను పెంచిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. రైతులు అధికంగా వినియోగించే ఎరువులైన 28.28.0, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (MoP ) ధరలు గత 90 రోజుల్లోనే వరుసగా 50-100 శాతం కంటే ఎక్కువగా పెరిగాయని, ఇది చాలా విచారకరమని అన్నారు. రైతులకు పెరుగుతున్న పెట్టుబడిని భరించి, ఎరువుల ధరను తగ్గించాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతుపై ఇంకా అదనపు భారం వేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం వల్ల వ్యవసాయ రంగంలో ఇంధన వినియోగం అనేక రెట్లు పెరిగిందని అన్నారు. అయితే పెట్రోల్ (petrol), డీజిల్ (diesel) ధరలు పెంచడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్రూడ్ ఆయిల్ దిగుమతి ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ విచక్షణారహితంగా సెస్ విధించడం వల్ల వాటి ధరలు పెరుగుతున్నాయని అన్నారు.
ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ తో (mgnregs) వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలని గతంలోనే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని లేఖలో సీఎం గుర్తు చేశారు. ఇలా చేయడం వల్ల కూలీల ఖర్చు కొంత రైతులు భరిస్తే మరి కొంత ప్రభుత్వాలు భరించాల్సి వస్తుందని తెలిపారు. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని పేర్కొన్నారు. వ్యవసాయోత్పత్తులకు ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం ఎక్కువగా ఎంఎస్ పీ నిర్ణయించాలని ప్రొఫెసర్ MS స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ కమిషన్ సిఫార్సులను సరిగా అమలు చేయడం లేదని అన్నారు.
ఎరువుల ధరలను, ఇంధన ధరలు పెంచడం, ఎంఎస్ పీ (msp) ధరలను తప్పుగా నిర్ణయించడం వల్ల కేంద్ర ప్రభుత్వం వల్ల రైతులకు సాగు ఖర్చులు పెరుగుతున్నాయని, దీంతో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని కూడా ఉల్లంఘిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే నిర్ణయం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఎరువుల ధర తక్కువగా ఉండేలా చూడాలని, రైతులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వంపై అదనపు ఖర్చును భరించాలని కోట్లాది మంది రైతుల తరపున తాను భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.