డ్రంక్ అండ్ డ్రైవ్.. 6గురు యువతులకు జైలు శిక్ష
ఈ నూతన సంవత్సరం జనవరి నెలలోనే ఆరుగురు యువతులు మద్యం సేవించినందుకుగాను జైలు శిక్ష అనుభవించారు.
ట్రాఫిక్ రూల్స్ ని పోలీసులు మరింత కఠినతరం చేశారనడంలో సందేహమే లేదు. ఒకప్పుడు డ్రంక్ డ్రైవ్ లో ఎవరైనా దొరికితే ఫైన్ కట్టించుకొని వదిలేసేవారు. తర్వాత.. రెండు రోజులపాటు కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టేవారు. అయితే.. ఇప్పుడు అలా జరిమానాతో వదిలేయడం లేదు.. జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. ఈ నూతన సంవత్సరం జనవరి నెలలోనే ఆరుగురు యువతులు మద్యం సేవించినందుకుగాను జైలు శిక్ష అనుభవించారు.
జైలు శిక్ష అనుభవించిన ఆరుగురు యువతులు ఐటీ ప్రొఫెషనల్స్ కావడం గమనార్హం. రీసెంట్ గా ఓ యువతి మద్యం సేవించి పోలీసులకు చిక్కింది. బ్రీత్ ఎనలైజర్ మద్యం మోతాదు చిక్ చేయగా.. 44ఎంజీగా చూపించింది. పరిమితి కి మించి మద్యం సేవించి వాహనం నడిపినందుకు ఆమెకు మూడురోజులు జైలు శిక్ష విధించారు.
గతంలో.. అమ్మాయిలు డ్రింక్ చేసి దొరికితే.. కేవలం జరిమానాలతో వదిలేసేవారు. కానీ ఇప్పుడు వారికి కూడా జైలు శిక్ష వేసేందుకు కోర్టులు వెనకాడటం లేదని ఓ కానిస్టేబుల్ తెలిపారు. వారానికి కనీసం ఇద్దరు అమ్మాయిలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతున్నారని చెప్పారు. వారిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులేనని ఆయన తెలిపారు. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే.. భవిష్యత్తులో పాస్ పోర్టు, వీసాల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఈ సందర్బంగా హెచ్చరించారు.