బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలంగాణలోని 16 జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో 16 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది. అవసరమైతే తప్ప ప్రజలెవరు ఇళ్ల నుండి బయటకు రావొద్దని అధికారులు కోరారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద్రాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ ప్రకటించింది.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి,రంగారెడ్డి, మేడ్చల్,వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు రాష్ట్రంలో రుతుపవనాలు చరుకుగా కదులుతున్నట్టుగా వాతావరణశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణశాఖ అధికారులు ప్రకటించారు.
ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. మూసీ పరివాహక ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
బంగాళాఖాతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడింది. తెలంగాణ పక్కనే ఉన్న మరఠ్వాడా పై 4.5 కి.మీ ఎత్తున గాలులతో మరో ఉపరితల ఆవర్తనం ఉంది. రుతుపవనాల గాలుల ద్రోణితో ఢిల్లీ బాలంగీర్, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు వ్యాపించింది. దీంతో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలిపారు.