ఇళ్లు కట్టినా.. పెళ్లికి సాయం చేసినా అది మేమే - మంత్రి కేటీఆర్
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వమే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తోందని, ఆడపడుచు పెళ్లికి సాయం చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు అమలు చేయలేదని అన్నారు.
తెలంగాణలో ఇళ్లు కట్టినా.. ఆడపడుచు పెళ్లికి సాయం చేసినా ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని, తమ ప్రభుత్వం మాత్రమే ఇది చేయగలిగిందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా సీసీ నగర్లో పలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు, ఇతర నాయకులతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఇళ్లు కేటాయించిన అందరికీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను అందించారు. అంతకు ముందు స్థానికంగా ఉన్న పొచ్చమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఎదురువచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలపై, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఇళ్లు కట్టడం, పెళ్లి చేయడం చాలా కష్టమని పెద్దలు ఊరికే అనలేదని అన్నారు. ఒక మనిషి జీవితంలో ఇవి రెండు చాలా కష్టమైన పనులని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తోందని అన్నారు. అలాగే ఆడపడుచుల పెళ్లికి రూ.100,116 ఆర్థిక సాయాన్ని ఇస్తున్నామని చెప్పారు. ఈ ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడ లేవని అన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు అమలు చేయడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.11 వేలు ఖర్చు చేసిందని చెప్పారు. త్వరలోనే అన్ని నిర్మాణాలు పూర్తవుతాయని, అప్పుడు లబ్దిదారులకు ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి మధ్యలో ఎవరైనా దళారీలు దూరే అవకాశం ఉందని, అలాంటి వారికి ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తుందని అన్నారు. ఎవరికీ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రారంభమైన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం: వరి కొనుగోలు సహా కీలకాంశాలపై చర్చ
అనంతరం మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. పేదలు సొంతింట్లో ఆత్మగౌరవంతో ఉండాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తుందని తెలిపారు. ఇది పూర్తిగా ఉచితమని, ఒక్క పైసా కూడా పేదవారు కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుందని అన్నారు. లబ్దిదారుల సమక్షంలోనే లాటరీ తీసి ఇళ్లను అందజేస్తామని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లను కొనడం, అమ్మడం నిషేదమని మంత్రి చెప్పారు. ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలులో ఉన్నాయని అన్నారు.