నిర్ణయం కేసీఆర్ చేతుల్లోనే, కవితనే అడగండి: డీఎస్
అంతా సీఎం నిర్ణయంపైనే
హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఏ నిర్ణయం తీసుకొన్నా సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉందని టీఆర్ఎస్ ఎంపీ డి. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీ నేత ఆజాద్ను కలిసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
తనపై వచ్చిన ఆరోపణల విషయమై బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ లో అనుచరులతో సమావేశాన్ని ముగించుకొని వచ్చిన డీఎస్ హైద్రాబాద్లో మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్లో చేరిన తర్వాత రాజకీయ నాయకులను కలవడమే మానేసినట్టు ఆయన చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా కానీ తాను పద్దతి ప్రకారం నడుచుకొంటానని ఆయన చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై సీఎంకు లేఖ రాయకుండా తనతో మాట్లాడితే సరిపోయేదన్నారు. లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందో నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలను అడగాలని ఆయన సూచించారు.
ఈ పరిమాణాలపై ఆయన దురదృష్టకరమైనవిగా పేర్కొన్నారు. క్రమశిక్షణ గురించి తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత పనిమీదనే తాను ఢిల్లీకి వెళ్ళినట్టు ఆయన చెప్పారు. ఢిల్లీలోని తన క్వార్టర్లో రిపేర్ పనుల నిమిత్తం వెళ్ళానని తెలిపారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలు కాకుండా ఇంకెవరూ కన్పిస్తారని డీఎస్ ప్రశ్నించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆజాద్ ను కలిసి తాను చర్చలు జరిపినట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
సీఎం పిలిస్తే పోతానని డీఎస్ చెప్పారు. సీఎం తనను పిలుస్తారని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తన కొడుకు కోసం టీఆర్ఎస్ను బలహీనపర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఎంపీ డీఎస్ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం. అయితే నిజామాబాద్ నుండి హైద్రాబాద్కు వచ్చిన తర్వాత సమాచారం ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే కేసీఆర్ డీఎస్ కు అపాయింట్ మెంట్ లభించినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో తనకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని డీఎస్ చెబుతున్నారు. అయితే ఆరు గంటలకు డీఎస్ సీఎం కేసీఆర్ తో సమావేశమౌతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తి కల్గిస్తోంది.