జాతీయ రాజకీయాల్లోకి ఇప్పుడే కాదు: తేల్చేసిన కేసీఆర్
జాతీయ రాజకీయాల్లోకి తాను వెళ్తున్నట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లోకి తాను వెళ్తున్నట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
సోమవారం నాడు టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది.ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులతో చర్చించారు.
జాతీయ రాజకీయాల్లోకి ఇప్పుడే పోవాల్సిన అవసరం లేదన్నారు.ఈ విషయంలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో తీసుకురానున్న కొత్త రెవిన్యూ చట్టంతో దేశం మొత్తం రాష్ట్రం వైపే చూసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక మంచి చట్టం తీసుకురాబోతున్నామని ఆయన చెప్పారు.దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లతో విజయం సాధించనున్నామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
అవసరమైనప్పుడు ఈ విషయమై మీ అందరితో చర్చిస్తానని కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని సీఎం పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు.
అసెంబ్లీ సమావేశాల్లో హుందాగా ఉండాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలను కోరారు.బుధవారం నాడు అసెంబ్లీలో కొత్త రెవిన్యూ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా సీఎం ఈ సందర్భంగా చెప్పారు.