దానంకు ఉత్తమ్ ఫోన్: మాజీ మంత్రిని బుజ్జగిస్తున్న పీసీసీ చీఫ్
దానంతో చర్చలకు ఉత్తమ్
హైదరాబాద్: పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి దానం నాగేందర్ను బుజ్జగించేందకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. దానం నాగేందర్తో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లో చర్చించారు. దానంతో ముఖాముఖి సమావేశం కానున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా చేస్తున్నట్టుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుక్రవారం నాడు లేఖ పంపారు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పార్టీ నాయకత్వం గౌరవించడం లేదనిఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి నేతలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆయన ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిన వెంటనే పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఫోన్లో చర్చించారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నాగేందర్కు సూచించారు.
పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల పట్ల దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఈ విషయమై తాను ముఖాముఖి మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నానని దానం నాగేందర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి హమీ ఇచ్చారు. ఈ హమీ మేరకు సాయంత్రం దానం నాగేందర్ ను కలిసి ఉత్తమ్ చర్చించనున్నారు. దానంతో అన్నీ విషయాలపై చర్చించనున్నట్టు ఉత్తమ్ మీడియాకు చెప్పారు.