రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేయనున్నట్లు గద్దర్ ప్రకటించారు. 

మెదక్ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ యుద్దనౌక, విప్లవ గాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు సంచలన ప్రకటన చేసారు. అంతేకాదు వచ్చేఅసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనే పోటీ చేయనున్నట్లు తెలిపారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో పోటీకి సిద్దమవుతున్నట్లు గద్దర్ ప్రకటించారు. 

మెదక్ జిల్లా తూప్రాన్ పోలీసులను కలిసిన గద్దర్ రక్షణ కల్పించాలని కోరారు. ఇకపై తాను పుట్టిపెరిగ ఊళ్లోనే వుండాలని భావిస్తున్నానని... ఇందుకోసమే పోలీసులను రక్షణ కోరినట్లు గద్దర్ వెల్లడించారు. ఇకపై ప్రజల్లో వుంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకుంటానని గద్దర్ వెల్లడించారు. 

అంబేద్కర్ స్పూర్తితోనే కేసీఆర్ రాచరిక పాలనకు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు గద్దర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గత తొమ్మిదేళ్ల పాలనలో దళితులకు తీరని అన్యాయం చేసారని... ఇది వారిని తెలియజేసి చైతన్యం తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారాలని... గతంలో తుపాకీతో రాజ్యాధికారం వస్తుందని భావించి పోరాటాలు చేసి ఇప్పుడు రాజ్యాంగబద్దంగా పోరాటానికి సిద్దమైనట్లు గద్దర్ తెలిపారు. ప్రజలు కూడా అంబేద్కర్ కల్పించిన ఓటుహక్కు అనే ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించుకుని సుపరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని గద్దర్ సూచించారు. 

Read More మే 8న హైదరాబాద్ రానున్న ప్రియాంక గాంధీ.. టీ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్..!

అయితే రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించారే గానీ ఏ పార్టీలో చేరబోతున్నది గద్దర్ బయటపెట్టలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఇదే కేసీఆర్ పై పోటీకి సిద్దమని గద్దర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. ఇప్పుడు మళ్లీ అలాగే కేసీఆర్ పై పోటీ అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ నుండి ఆయనకు ఏమయినా గ్రీన్ సిగ్నల్ వచ్చిందేమోనన్న చర్చ జరుగుతోంది. 

ఇక ఇటీవల టీఎస్ పిఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద టీ సేవ్ దీక్ష చేపట్టింది. ఇందులో పాల్గొన్న గద్దర్ షర్మిల నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన చేపట్టిన పోరాటానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే షర్మిల రాజకీయ శక్తిగా ఎదిగిందని... అందువల్లే ఆమెను ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తోందని అన్నారు. ఆదే వేదిక పైనుండి డబ్బులతో గెలవాలనుకునే కేసీఆర్ ను ప్రజలే తగిన సమాధానం చెబుతారని గద్దర్ పేర్కొన్నారు. 

Read More తడిసిన ధాన్యానికీ మామూలు వరి ధరే.. రైతాంగానికి కేసీఆర్ గుడ్‌న్యూస్ , నాలుగు రోజులు కోతలు వద్దన్న సీఎం

ఇలా షర్మిలకు మద్దతు తెలిపిన గద్దరు వైఎస్సార్ టిపి లో చేరి కేసీఆర్ పోటీ చేస్తారేమో అన్న మరో చర్చ కూడా జరుగుతుంది. గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటన చేయడం బాగానే వున్నా... ఏ పార్టీలో చేరతారన్నదే ప్రశ్నగా మిగిలిపోయింది. ఏ పార్టీలో చేరకుండా కొత్తగా పార్టీ ఏమయినా పెడతారా లేక స్వంతంత్రంగానే గజ్వెల్ లో పోటీ చేస్తారా అన్నది త్వరలోనే తేలిపోనుంది.