హైదరాబాద్ శంషాబాద్లో ఆత్మహత్యకు యత్నించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని సౌందర్య మృతిచెందింది. మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తాజాగా తుదిశ్వాస విడిచింది.
హైదరాబాద్ శంషాబాద్లో ఆత్మహత్యకు యత్నించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని సౌందర్య మృతిచెందింది. మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తాజాగా తుదిశ్వాస విడిచింది. ఆమెకు గతేడాది డిసెంబర్లో వివాహం కాగా.. జీవితం విరక్తి భావనతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. వివరాలు.. కొండాపూర్లోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సౌందర్యకు గతేడాది డిసెంబర్ 2వ తేదీన మహారాష్ట్ర సోలాపూర్కు చెందిన మెకానికల్ ఇంజినీర్ అభినవ్తో వివాహం జరిగింది.
ఈ నెల 8వ తేదీన సౌందర్య ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. అదే రోజు ఇంట్లో వాళ్లు ఫోన్ చేయగా.. తాను దూరంగా వెళ్లపోతున్నానని చెప్పిన సౌందర్య ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే శంషాబాద్లో ఐదు అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వెంటనే సౌందర్య భర్త అభినవ్.. ఈ విషయాన్ని డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. దీంతో వెంటనే శంషాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే సౌందర్య బిల్డింగ్ పైనుంచి దూకేసింది. అక్కడ ఆమె రక్తపు మడుగులో పడి కనిపించింది.
దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందిన సౌందర్య.. పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఇక, పోస్టుమార్టం అనంతరం సౌందర్య మృతదేహాన్ని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే గత కొంతకాలంగా సౌందర్య మానసికంగా బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. తాను ఊహించుకున్న జీవితం దొరకలేదని ఫ్రెండ్స్తో చెప్పి బాధపడినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే మనస్తాపంతో సౌందర్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
