హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిల్లో పెండింగ్ చలాన్ల చెల్లింపు విషయంలో పోలీస్ శాఖ ఆఫర్ ఇచ్చింది.  మార్చి 1 నుండి 31వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని పోలీస్ శాఖ ప్రకటించింది. 

హైదరాబాద్:GHMC పరిధిలో వాహనాలపై ఉన్న Traffic Challan చెల్లింపులపై Police శాఖ భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు Special drive ను నిర్వహించనున్నారు. హైద్రాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు రూ. 600 కోట్ల మేరకు పెండింగ్ చలాన్లు ఉన్నాయని పోలీస్ శాఖ గుర్తించింది. అయితే మార్చి 1 నుండి 31వ తేదీ లోపుగా పెండింగ్ చలాన్లు చెల్లించిన వారికి డిస్కౌంట్ ఇచ్చింది పోలీస్ శాఖ.

టూ వీలర్ల యజమానులు 25 శాతం కార్ల యజమానులు 50 శాతం, ఆర్టీసీ బస్సులు 30 శాతం, తోపుడు బండ్ల యజమానులు 20 శాతం మాత్రమే పెండింగ్ చలాన్లలో చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తామని పోలీస్ శాఖ తెలిపింది. మీ సేవా, ఆన్ లైన్ గేట్ వేల ద్వారా ఈ చలాన్లను చెల్లించవచ్చని పోలీస్ శాఖ తెలిపింది.

మరో వైపు హైద్రాబాద్ లో ప్రమాదాలు ఏ సమయంలో జరుగుతున్నాయనే విషయమై కూడా అధ్యయనం చేశారు. రాత్రి పూట మాత్రమే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అయితే రాత్రి సమయాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్ లను ఉపయోగించాలని భావిస్తున్నారు. 

మద్యం తాగి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకొంటున్నారు. రాత్రి పూట చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ పరిధిలో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, వెస్ట్-సెంట్రల్ అనే ఆరు జోన్లున్నాయి. ఈ జోన్లలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 2500 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. 

2016 నుండి ఉన్న ఆటో రిక్షాల మీటర్ల రేట్లను త్వరలోనే సవరించే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా మంది ఆటో డ్రైవర్లు మీటర్లను ఉపయోగించడం లేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మీటర్ల రేట్ ను సవరించే అవకాశాలను కూడా ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తున్నారు. కరోనా కారణంగా పెండింగ్ చలాన్ల చెల్లింపు విషయంలో కూడా పోలీస్ శాఖ డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే పోలీస్ శాఖ తీసుకొన్న నిర్ణయం మాత్రం వాహనదారులకు పెద్ద ఊరటగానే చెప్పవచ్చు.

పెండింగ్ లో ఉన్న చలాన్లు ఉంటే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైన వాహనాన్ని నిలిపివేస్తే అక్కడే పెండింగ్ చలాన్లు చెల్లించాల్సిన పరిస్థితులున్నాయి. అయితే మార్చి మాసంలో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ ను ఉపయోగించుకోవాలని వాహన దారులకు పోలీస్ శాఖ సూచిస్తోంది. 

అయితే రూ. 600 కోట్లలో ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా పోలీస్ శాఖకు ఎంత మేరకు వసూలు కానుందో మార్చి చివర్లో తేలనుంది. మరో వైపు ఈ స్పెసల్ డ్రైవ్ నిర్వహించకపోతే రూ. 600 కోట్లలో వసూలయ్యేది ఎంతో కూడా ఇప్పుడే చెప్పలేమనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. పెండింగ్ చలాన్ల చెల్లింపు కోసం వాహన దారులు ఈ స్పెషల్ డ్రైవన్ ఉపయోగించుకొంటారని పోలీస్ శాఖాధికారులు చెబుతున్నారు.