చెల్లి అని ప్రేమగా పిలిచి పెళ్లి చేసుకున్నాడు
‘ఇంటికి వచ్చిన ప్రతిసారీ ప్రేమగా... చెల్లి, చెల్లి అని పిలిచేవాడు. అలాంటిది ఒక్కసారిగా ఇంట్లో నుంచి తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అందుకే అతనిని చంపాలనుకున్నాం’ అని నిందితులు తెలిపారు.
‘ఇంటికి వచ్చిన ప్రతిసారీ ప్రేమగా... చెల్లి, చెల్లి అని పిలిచేవాడు. అలాంటిది ఒక్కసారిగా ఇంట్లో నుంచి తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అందుకే అతనిని చంపాలనుకున్నాం’ అని నిందితులు తెలిపారు. ఇటీవల ఎస్ఆర్ నగర్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై యువతి కుటుంబసభ్యులు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి సమీపంలోని శాంతినగర్కు చెందిన షేక్ ఇంతియాజ్(21) నాంపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. బోరబండలో నివసిస్తున్న బంధువు సయ్యద్ ఆలీ ఇంటికి తరచూ వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో ఆయన కుమార్తె సయ్యద్ జైనా ఫాతిమా(19)తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విషయం ఇరు కుటుంబాలకు తెలిసినప్పటికీ అమ్మాయి తరఫు వారు వివాహానికి అంగీకరించలేదు. దీంతో వారు రంజాన్ రోజున సదాశివపేటలోని ఓ దర్గా సమీపంలో ఒక్కటయ్యారు.
ఈ క్రమంలో కుమార్తె కనిపించడం లేదంటూ రెండు రోజుల కిందట యువతి తండ్రి ఆలీ ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంగారెడ్డి వెళ్లి అక్కడి పోలీసులను కూడా సంప్రదించాడు. అక్కడ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో.. కూతురు, అల్లుడిని ఏమీ చేయనని హామీ ఇచ్చాడు. వారిని ప్రేమగా చూసుకుంటామని మాయమాటలు చెప్పాడు.
అలా వాళ్లను నమ్మించి వెంటనే అమీర్ పేటలో వాళ్లపై కత్తులతో దాడి చేశాడు. ఇంతియాజ్, ఫాతీమాలపై దాదాపు 10మంది వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో ఇంతియాజ్ తీవ్రంగా గాయపడగా.. ఫాతిమాకి స్వల్పంగా గాయాలయ్యాయి.
ఈ కేసులో నిందితులు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెల్లి అని పిలుస్తూ ఇలా చేస్తాడని తాము అనుకోలేదని, తమ పరువు అంతా పోయిందని నిందుతులు చెప్పారు. ఫాతిమా కి కొంత కాలం క్రితం వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిపించామని.. ఇంతలోనే ఇంతియాజ్ ఇలా చేశాడని వారు చెప్పారు. తన స్నేహితుల సహాయంతో ఇంతియాజ్ పై దాడి చేసినట్లు ఫాతిమా సోదరుడు అంగీకరించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.