హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో కొద్దిరోజుల క్రితం మొండెం లేని తల మిస్టరీ వీడింది. ఆ తల కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న నర్సు ఎర్రం అనూరాధదిగా గుర్తించారు పోలీసులు.

హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో కొద్దిరోజుల క్రితం మొండెం లేని తల లభ్యమైన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తలకు సంబంధించిన మిస్టరీ వీడింది. ఆ తల కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న నర్సు ఎర్రం అనూరాధదిగా గుర్తించారు పోలీసులు. ఈమె వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. అనూరాధను హత్య చేసిన దుండగులు ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. అనంతరం వాటిని ఫ్రీజ్‌లో దాచినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

కాగా.. గత వారం మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసీ నది సమీపంలో మొండెం లేని తల లభించడం కలకలం రేపింది. దీంతో ఆ తల ఎవరిదన్నది తెలుసుకోవడానికి పోలీసులు 8 బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. తలను పోస్టర్లుగా ముద్రించి దాని సాయంతో ఆరా తీశారు. అలాగే నగరంలో మిస్సింగ్ కేసులను కూడా విశ్లేషించారు. ఈ క్రమంలోనే ఆ తల నర్సు అనూరాధదిగా తేలింది.