కర్ణంగూడ కాల్పుల ఘటనలో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. శ్రీనివాస్ రెడ్డి తన పేరిట ఉన్న ఆస్తులను నవీన్, హఫీజ్ ల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్: హైద్రాబాద్ కు సమీపంలోని Karnamguda కాల్పుల ఘటనలో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. Srinivas Reddy తన ఆస్తులను తన వద్ద పనిచేసే Hafiz, Naveenపేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టుగా గుర్తించారు.

హైద్రాబాద్ శివారు ప్రాంతాల్లో శ్రీనివాస్ రెడ్డి భూ దందాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలోనే తుర్కయంజాల్ వద్ద ఉన్న డబుల్ రిజిస్ట్రేషన్ భూమిని శ్రీనివాస్ రెడ్డి సెటిల్మెంట్ చేశాడు. దీంతో శ్రీనివాస్ రెడ్డికి భారీగా డబ్బులు వచ్చాయని పోలీసులు గుర్తించారు.

శివారు ప్రాంతాల్లోని వివాదాల్లో ఉన్న భూములను శ్రీనివాస్ రెడ్డి కొనుగోలు చేసేవాడని పోలీసులు గుర్తించారు. కర్ణంగూడ వద్ద కొనుగోలు చేసిన భూమి కూడా వివాదంలో ఉందని కూడా శ్రీనివాస్ రెడ్డికి తెలుసునని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మూడు మాసాల క్రితం కర్ణంగూడ వద్ద భూమిని కొనుగోలు చేశారు.

గతంలో చేసిన భూ వివాదాలు కూడా శ్రీనివాస్ రెడ్డి హత్యకు దారితీశాయా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం నాడు దుండగులు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు మరణించారు.శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై ముగ్గురు దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

బుల్లెట్లు స్వాధీనం చేసుకొన్న ప్రాంతంలోనే దుండగులు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీలో మాత్రం కార్లు వంటి వాహనాలు ఫైరింగ్ జరిగిన ప్రాంతం వైపునకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే కాల్పులు జరిగిన ప్రాంతానికి దుండగులు బైక్ పై వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రెండు అనుమాన్సాస్పద స్కార్పియోల్లో బుల్లెట్లు దొరకడం కలకలం రేపుతుంది. ఈ బుల్లెట్లను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.అయితే ఈ వాహనాలు ఎవరివనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే శ్రీనిాస్ రెడ్డికి గతంలో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో ఆయన ఎక్కువ దూరం పరుగెత్తలేకపోయాడు. సమీపంలోని పొదల్లోనే శ్రీనివాస్ రెడ్డిని దుండగులు పట్టుకొన్నారు. శ్రీనివాస్ రెడ్డిపై షాట్ వెపన్ తో దుండగులు కాల్పి చంపారు. మరో వైపు కారులో ఉన్న రాఘవేందర్ రెడ్డి కారును రోడ్డు వరకు తీసుకెళ్లాడు. 

కానీ అక్కడి నుండి ఆయన కారును నడపలేకపోయాడు. వెంటనే కృష్ణ, హఫీజ్ లకు రాఘవేందర్ రెడ్డి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం ఆధారంగా కృష్ణ, హఫీజ్ లు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో మట్టారెడ్డి కూడా ఉన్నారు. ఈ విషయమై హఫీజ్, కృష్ణలు మట్టారెడ్డిని నిలదీశారు.

 మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డికి మధ్య విబేధాలున్నాయి. ఈ విషయమై మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సంఘటన స్థలానికి వచ్చిన కృష్ణ, హఫీజ్ లను కూడా పొలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.ఈ కేసులో ఇప్పటికే మట్టారెడ్డితో పాటు హఫీజ్ , కృష్ణతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.